కోవిడ్ బారిన పడకుండా తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ కరోనా నివారణ టీకాలు తప్పకుండా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఆరోగ్య బోధకులు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం బిచ్ కుంద మండలంలోని శాంతాపూర్, చిన్న దడ్గీ, పెద్ద దడ్గీ, మాన్యపూర్, రాజుల గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జిల్లా ఆరోగ్య బోధకులు మాట్లాడుతూ జిల్లాలో 12 ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ బీఎల్ ఓస్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ ఓటర్ లిస్ట్ ద్వారా టీకాలు తీసుకోని వారిని గుర్తించి అవగాహన కల్పిస్తూ టీకాలు ఇస్తున్నామన్నారు.
జిల్లాలో 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని మిగతా 10శాతం త్వరలో పూర్తి చేస్తామన్నారు. బిచ్కుంద మండలంలో 85 శాతం కోవిడ్ టీకాలు ఇవ్వడం పూర్తి కాగా మిగిలి పోయిన వారి లిస్టును పరిశీలించి ఫోన్ల ద్వారా సమాచారం అందించి వలసపోయిన వాళ్లకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఎక్కడి వారికి అక్కడే వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వైద్య సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కోవిడ్ టీకాలి తీసుకోవాలని, శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించి కోవిడ్ బారిన పడకుండా కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విఠాబాయి, ఏఏన్ఏంలు ప్రతిభ, శోభ, ఆశా కార్యకర్తలు కృష్ణవేణి, మహనంద, వీఆర్ఏలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
జీ. లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం