కరోనా విలయతాండవం వేస్తున్న వేళ కార్పొరేట్ సంస్థలు మందుకు రావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ను ఆయన అభినందించారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి, మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు.
సుమారు 15 లక్షలు విలువైన 12 ఆక్సీజన్ కాన్సెంటేటర్లను, 2500 శానిటైజర్ (200 మి.లీ) బాటిళ్లను పైడిభీమవరానికి చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ కలెక్టర్కు అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సీజన్ కాన్సెంటేటర్ల అవసరం చాలా ఉందన్నారు. ఒక్కొక్కటి సుమారు రూ.80వేలు విలువైన ఆక్సీజన్ కాన్సెంటేటర్లను అరబిందో ఫార్మా ఫౌండేషన్ అందజేసిందని, వాటిని ఎస్కోట, పార్వతీపురం తదితర అవసరమైన ఆసుపత్రులకు పంపిస్తామని తెలిపారు.
కరోనా కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాగం పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడం జరుగుతోందని, దీనిలో భాగంగా గ్రామ, వార్డు కమిటీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో కమిటీలను ఏర్పాటు చేశామని, వీరంతా అక్కడి ఎఎన్ఎం, ఆశా వర్కర్లు, వైద్యాధికారులను సమన్వయం చేసుకొని పనిచేస్తారని చెప్పారు.
ఈ కమిటీల సభ్యులకు శానిటైజర్లను అందజేస్తామని చెప్పారు. వారికి కోవిడ్ పరీక్షలను నిర్వహించడంతోపాటు, వేక్సినేషన్ కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన నా ఊరు-విజయనగరం
ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజహర్ లాల్ అన్నారు. ఉచిత అంబులెన్సు సేవలను ప్రారంభించిన నా ఊరు-విజయనగరం స్వచ్ఛంద సంస్థను అభినందించారు. ఇలాంటి కష్టకాలంలో, బాధితులను ఆదుకొనేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు.
నా ఊరు- విజయనగరం సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సు, ఉచిత వాహన సేవలను, కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. ఈ సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జి.విశాలాక్షి మాట్లాడుతూ, కరోనా విస్తృతి తీవ్రంగా ఈ పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా, కోవిడ్ బాధితులను ఆదుకొనేందుకు ఉచిత అంబులెన్సు సేవలను ప్రారంభించామన్నారు.
తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా సేవలను అందిస్తామని తెలిపారు. కోవిడ్ బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు, వేలాంగిణిమాత అంబులెన్స్ సర్వీసెస్ సహకారంతో ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించామన్నారు. అలాగే మృతదేహాలను శ్మశానవాటికకు తరలించేందుకు మరో వాహనాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.
విజయనగరం డివిజన్లో, విజయనగరం కేంద్రంగా ఒకటి, పార్వతీపురం డివిజన్లో, బొబ్బిలి కేంద్రంగా మరో అంబులెన్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో బాటుగా కోవిడ్ బాధితులకు ఉచితంగా భోజనాన్ని కూడా అందజేస్తున్నామన్నారు.
హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు గానీ, ఆసుపత్రిలో ఉన్నవారికి గానీ, ముందుగా తమకు ఫోన్ చేస్తే భోజనాన్ని అందిస్తామని తెలిపారు. తమ సంస్థ నుంచి సేవలు, సహకారం కోసం 9000336939 సెల్ నెంబరు ద్వారా సంప్రదించాలని విశాలాక్షి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, అరబిందో ఫార్మా సీనియర్ జిఎం ఎన్ఆర్ రాజారెడ్డి, ఆఫీసర్ పి.గోపాలకృష్ణారెడ్డి, శంకర్ తోపాటు బి.గణేష్, వేలాంగిణి మాత అంబులెన్స్ సర్వీసెస్ ప్రతినిధి ఇజ్రాయిల్, నా ఊరు-విజయనగరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె.చంద్రిక, చందు, తిరుపతిరావు, సూర్యప్రభ, మురళి తదితరులు పాల్గొన్నారు.