ఆసుపత్రి ఉన్నది ఎందుకు? మనిషిని బతికించడానికి. శత విధాలా ప్రయత్నించినా బతక్కపోతే ‘సారీ’ చెప్పడానికి… అంతే కదా?
అయితే కృష్ణా జిల్లా మైలవరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి రోగుల బంధువులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నది. మనిషిని బతికిస్తామో లేదో చెప్పడం లేదు కానీ… బిల్లు కడితే శవాన్ని తామే దహనం చేస్తామనేది ఆ బంపర్ ఆఫర్.
లీలా కుమారి(65) అనే మహిళకు కరోనా సోకితే ఆమె కుమార్తె మైలవరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు.
నాలుగు లక్షలు ఖర్చు అయినా తన తల్లి దక్కలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
పైగా కరోనా తో మృతి చెందిన తన తల్లిని దహనం చేసేందుకు బంపర్ ఆఫర్ ఆసుపత్రి సిబ్బంది ఇచ్చారని పేర్కొన్నారు.
రూ లక్షా ఇరవై వేలు కడితే తన తల్లికి దహన సంస్కారాలు నిర్వహిస్తామని ఆసుపత్రుల నిర్వాహకులు పేర్కొన్నారని ఆమె తెలిపింది.
రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ఖరీదు గల ఇంజక్షన్లు మందులు రాసేవారిని, ఆసుపత్రిలో సిబ్బంది కూడా రాత్రులు ఉండేవారు కాదని, లక్షలు డబ్బులు వసూలు చేయడం తప్ప పేషెంట్లు బాగోగులు ఆసుపత్రికి పట్టలేదని ఆమె వాపోయారు.
ఆమె తల్లికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అని వెంటిలేటర్ పై చికిత్స అందించవలసి వస్తుందని అందుకుగాను నాలుగు లక్షల రూపాయలు చెల్లించ వలసినది గా యాజమాన్యం డిమెండ్ చేసిందని ఆమె తెలిపారు.
వారి నిర్లక్ష్యం వల్ల తమ తల్లిని కోల్పోయానని ఆమె వాపోయింది. కనీసం సిబ్బంది కూడా లేని ఆసుపత్రికి కోవిడ్ ఆసుపత్రిగా అనుమతి ఎలా ఇచ్చారంటూ?ఆమె ప్రశ్నించింది.