ఉరుము ఉరిమి దేనిమీదో పడ్డట్టు…. పెద్ద పెద్ద నాయకులు వాలంటీర్ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఏరికోరి కావాలని పెట్టుకున్న వాలంటీర్లలో ఇప్పుడు అవినీతిపరులు ఉన్నారంటూ చురకలు అంటిస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థలో అవినీతిపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు వాలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని మండిపడ్డారు. కరోనా వేళ తాము ప్రజల్లోకి రాకపోవడాన్ని అలుసుగా తీసుకున్నారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు.
గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి ఛార్జ్మెమోలు జారీ చేశామని ఎమ్మెల్యే అన్నారు. అవినీతికి పాల్పడిన మరికొందరిని సస్పెండ్ చేశామన్నారు. పథకాల అమలులో డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. సీఎం ఆశయాన్ని వమ్ము చేస్తున్న వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.