గ్రామాలవారీగా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు టోకెన్లను జారీచేసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి వేచిచూడకుండా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
దీని కోసం వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం ఏఈఓలు, ఏఓలు, ఇతర అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.
పత్తి కొనుగోళ్లపై మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో బాటు మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు రవికుమార్, సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లపై జిల్లాకో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రైతుల ఫిర్యాదులు, సూచనలు, సలహాలు స్వీకరించాలని మంత్రి కోరారు. మిల్లర్లు వెంటనే సీసీఐతో అగ్రిమెంట్ చేసుకోవాలని, మార్కెటింగ్, వ్యవసాయ, పోలీస్, రవాణా, అగ్నిమాపక, తూనికలు, కొలతల శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి ఎట్టి పరిస్థితులలో అకాలవర్షాల మూలంగా తడిసే పరిస్థితి ఉండకూడదని ఆయన అన్నారు. 300 జిన్నింగ్ మిల్లులు, 9 మార్కెట్ యార్డ్ లలో కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటుకు సీసీఐ సిద్దం అయింది. 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.5825 , 9 శాతానికి రూ.5766.75 , 10 శాతానికి రూ.5708,50 పైసలు, 11 శాతానికి రూ.5650.25, 12 శాతానికి రూ.5582.
సీసీఐ సూచించిన 8 శాతం తేమకన్నా తక్కువగా ఆరుశాతం తేమ ఉంటే మద్దతుధర రూ.5825 కు అదనంగా రూ.116.50, ఏడు శాతం తేమ ఉంటే అదనంగా రూ.58.25 పైసలు ఇస్తారు.