ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తనపై అసత్య ఆరోపణలు చేసిన ప్రస్తుత మంత్రి, ఆ నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ప్రత్యేక కోర్టు నేడు విచారణ జరిపింది. నేడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు.
దాంతో తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసిన న్యాయస్థానం, వాయిదాకు హాజరు కావాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా నలుగురికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కాకాణి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తనపై ఆరోపణలు చేశారన్న సోమిరెడ్డి పిటిషన్ కు సంబంధించిన ఫైళ్ల చోరీ ఇటీవల జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. నెల్లూరు కోర్టులో ఫైళ్లు మాయం కావడం వాటిపై పోలీసులు దర్యాప్తు జరపడం తెలిసిందే.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయంతోనే ఆయన ఫైళ్లు మాయం అయ్యాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇదిలావుంటే కోర్టు వాయిదాలకు కాకాణి హాజరుకాకపోవడాన్ని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తప్పుపట్టారు. కేసు విచారణకు వచ్చేసరికి ఆధారాలు మాయం చేయొచ్చు అంటూ దొంగలు, క్రిమినల్స్కి మంత్రి కాకాణి రోల్ మోడల్గా నిలిచారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. న్యాయస్థానాల్లో ఆధారాల భద్రత, పతిష్ఠ ఏర్పాట్లుపైనా సరికొత్త చర్చ నడుస్తోందన్నారు.