APMSIDC (ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన రాధిక కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్ లో పనిచేస్తూ రాధిక మరణించిన విషయం తెలిసిందే. పై అంతస్తుల్లో సివిల్ ఇంజనీరింగ్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే రాధిక ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆయన అన్నారు.
శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వేలాది మంది కరోనా పాజిటివ్ బాధితులు వారి సహాయకులు ప్రతి నిత్యం ఆసుపత్రి ఆవరణలో వుంటున్నారు అలాంటి సమయంలో అజాగ్రత్తగా ఉన్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.