రాజన్న సిరిసిల్లా జిల్లాలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఐటి, పురపాలక శాఖా మంత్రి కేటిఆర్ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ చికిత్స కోసం వార్డును, ఐసోలేషన్ వార్డు, ఐదు అంబులెన్స్ లను ప్రారంభించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కోసం 2కోట్ల 28లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక శాసన సభ్యులు, ఐటి మున్సిపల్ శాఖా మంత్రి పలు ప్రారంభోత్సవాలు శంఖుస్థాపనలు చేశారు. ఆయనతో పాటుగా టెస్కాబ్ ఛైర్మెన్ కొండూరి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా వైద్యాధికారులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
స్థానిక ప్రజల కోసం ఏరియా ఆసుపత్రిలో కరోనా వార్డును ప్రారంభించి వార్డులోని సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలోనె ఐదు అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సర్దాపూర్ లొని అగ్రకల్చర్ కళాశాలలో 32పడకలతో ఐసోలేషన్ వార్డును ప్రారంభించారు.
అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వాసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ కోసం 2.2 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో కరోణా నివారణ కోసం ప్రతి రోజు 1000 కరోణ టెస్టులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లాలో హోం క్వారెంటెన్ ఉన్న వారందరికీ ఐసొలెషన్ కిట్ లు అందిస్తామని, రాజకీయాలలో విమర్శలకు ప్రతి విమర్శలు ఇది సమయం కాదని, మరికొంత కాలం కరోనాతో సాహవాసం చేయక తప్పదని స్పష్టం చేశారు. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలని సూచించారు.
టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్లాస్మా డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని, కరోనా వచ్చిన వారందరినీ వెలి వేసిన వారిలా చూడకుండా మానవతా దృక్పథంతో చూసి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.