చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ కరోనా సంబంధిత మందులు, వైద్య పరికరాలు పంపిణీ చేసింది.
గత కొద్ది రోజులుగా కరోనా అదుపు చేసేందుకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు, వైద్య పరికరాల కొరత ఉండకుండా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా అన్ని చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం తరపున చేసే ఈ ప్రయత్నాలకు తోడు సామాజిక బాధ్యతగా రోజా ఛారిటబుల్ ట్రస్ట్ కూడా పలు రకాల మందులు, వైద్య పరికరాలను ఆసుపత్రులకు అందచేస్తున్నది.
ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు, థర్మో గన్స్, సర్జికల్ గ్లౌజెస్, సర్జికల్ మాస్క్ లు, ఎన్ 95 మాస్కులు, శానిటైజర్లు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు అందచేస్తున్నారు.
అదే విధంగా 100 పడకల ఆసుపత్రులకు కూడా రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఈ పరికరాలను సమకూరుస్తున్నది.
నగరి గౌరవ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా తరపున రోజా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆమె భర్త ఆర్.కె.సెల్వమణి నేడు మలివిడత పరికరాలను మందులను అందచేశారు.
నగరి నియోజకవర్గంలోని పి.హెచ్.సి లకు కోవిడ్ నివారణకు అవసరమైన మందులు, మాత్రలను మంగళవారం ఉదయం పుత్తూరులో కావమ్మ గుడి ప్రక్కన గల వైఎస్సార్ సమావేశ మందిరంలో సంబంధిత వైద్య అధికారులకు పంపిణీ చేశారు.
నియోజకవర్గం పరిధిలోని గొల్లపల్లి, పుత్తూరు అర్బన్, పరమేశ్వర మంగళం, నగరి అర్బన్, బుగ్గ అగ్రహారం, నిండ్ర, విజయపురం పి.హెచ్.సి ల వైద్యాధికారులకు మాత్రలు, వైద్య పరికరాలు అందచేశారు.