విజయవాడలో బాపులపాడు మండలం రేమల్లే గ్రామరైతు ఎద్దు మరణిస్తే దాని యజమానికి కెడిసిసి ద్వారా రూ.25వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నామని కెడిసిసిబి చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రైతు గంధం సాంబశివరావుకు చెందిన ఎద్దు ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించగా కెడిసిసిబి నుండి రూ.25వేలు చెక్కును విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో యార్లగడ్డ చేతుల మీదుగా రైతు సాంబశివరావుకు అందచేశారు.
ఎడ్లు మరణిస్తే రైతు బాధలు తీర్చలేనివి
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు చేదోడుగా ఉండే ఎడ్లు ఆకస్మికంగా మృతిచెందితే రైతుల బాధలు తీర్చలేనివని అన్నారు. ఎడ్లను కోల్పోయి బాధపడుతున్న రైతులకు చేయుతనిచ్చేందుకు కెడిసిసి ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో ని రైతుల ఎద్దు ప్రమాదంలో చనిపోతే దాని యజమాని కి ఈ విధంగా సాయం ఇస్తామన్నారు. మరణించిన ఎద్దు ఫోటో, వైద్యుని ధ్రువపత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కెడిసిసి పథకం రైతులందరికీ వర్తింపు
జిల్లాలోని రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందని యార్లగడ్డ వివరించారు. గతంలో కేవలం సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే ఈ విధమైన సాయం అందించేవారని తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రుణంతో సంబధం లేకుండా ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ రాజయ్య, హనుమాన్ జంక్షన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.