విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ఎర్రదివిటి కనుమరుగైపోయింది. పేదోడి కష్టాలను తన భుజాలపై వేసుకొని పోరాడిన బొడ్డు అప్పలరాజు అకాలమృతి చెందారు.
ఈమేరకు సీపీఐ ఆయనకు అశ్రునివాళి అర్పించింది. నగరంలో కామ్రేడ్ సోదరులంతా…కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ బొడ్డు అప్పలరాజు (టిఫిన్ కొట్టు అప్పలరాజు) లేనిలోటు ఎవ్వరూ పూడ్చలేనిదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు.
కామ్రేడ్ అప్పలరాజు భౌతికకాయనికి పూలమాల వేసి విప్లవజోహార్లు పలికారు.
అనంతరం సీపీఐ ఎమ్.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పి.మల్లిక్ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో బుగత అశోక్ మాట్లాడుతూ ప్రతి వామపక్ష పార్టీ నేతకు మా పార్టీ, మా పార్టీ నాయకుడు అని చెప్పుకునే వారున్నారు కానీ అన్ని వామపక్ష పార్టీల నాయకులు టిఫిన్ కొట్టు అప్పలరాజు మా కమ్యూనిస్టు అని, మా ఎర్రజెండా ముద్దుబిడ్డ అని చెప్పుకునే ఏకైక వ్యక్తి కేవలం కామ్రేడ్ అప్పలరాజు మాత్రమే అని అశోక్ అన్నారు.
ఆకలి అనే మాట అతని చెవిన పడితే అన్నార్తులకు కడుపునిండా ఏమి ఆశించకుండ అన్నం పెట్టే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారని అన్నారు. ఎర్రజెండా అనే మాట వింటే ఆయన ఒంట్లో ఎదో తెలియని కరెంట్ ప్రవహించేదని అన్నారు. నా లాంటి ఎంతోమందికి కమ్యూనిస్టు ఉద్యమంలో సలహాలు సూచనలు ఇచ్చేవారని గుర్తుచేశారు.
తన దగ్గర ఉన్నది అందరికి పంచిపెట్టి సోషలిజం సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించిన ఒక గొప్ప సోషలిస్టు అని అశోక్ కొనియాడారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆశయానికి మరణం లేదని అశోక్ అన్నారు. సిపిఐ జిల్లా సమితి తరపున కామ్రేడ్ అప్పలరాజు కు అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.జీవన్, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ ఇబ్రహీం, న్యాయవాది కె.సన్యాసిరావు, చోడి ఆదినారాయణ, జర్నలిస్ట్ మిత్రులు, జనసేనపార్టీ జిల్లా నాయకులు త్యాడ రామకృష్ణ, జిల్లా అభివృద్ధి వేదిక నేతలు షన్ముఖరావు, సీహెచ్ దుర్గారావు, టి.వి.దుర్గారావు కార్మికులు పాల్గొన్నారు.