జర్నలిస్టుల సమస్యలపై సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. పాత్రికేయులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. పలు రకాల సమస్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసి తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకత్వం విన్నవించిందని తెలిపారు. వీటిలోని ప్రధాన సమస్యల్లో జర్నలిస్టుల డిమాండ్లు కీలకమైనవిగా సూచించారని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వాలని కోరామని తెలిపారు. ఇంకా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని, దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బంధు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వే పాస్ పునరుద్దరించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక తరహాలో రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మహిళా జర్నలిస్టులకు రక్షణ, రవాణా సౌకర్యాలు కల్పించాలని, జి.ఓ నంబర్ 239ను సవరించి, ఆర్ఎన్ఐతో నిర్వహిస్తున్న చిన్న పత్రికలనూ ఎంప్యానల్లో చేర్చడంతో పాటు ప్రోత్సాహకాలు, అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు.
డిజిటల్ మీడియా సమస్యలన్నీ పరిష్కరించాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, జర్నలిస్టుల కోసం రక్షణచట్టం చేయాలని డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అవసరమైనప్పుడు విధుల్లోకి తీసుకొని, ఆపై తీసివేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. డెస్క్ జర్నలిస్టులతో రోజుకు ఆరున్నర గంటలకుమించి పని చేయించొద్దని, ఒకవేళ చేయిస్తే ఓవర్ టైం అలవెన్స్ కట్టించాలని విజ్ఞప్తి చేశారు. యాడ్స్, సర్క్యులేషన్ టార్గెట్ పేరుతో విలేకరులపై వేధింపు చర్యలను అరికట్టాలని కోరారు. తదితర సమస్యలపై మంగళవారం నిర్వహించే ధర్నాకు అన్ని జర్నలిస్టు సంఘాల మద్దతు కోరుతున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టులు భారీగా తరలివచ్చి 6న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని నున్నా కోరారు.