భూములను బలవంతంగా తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సీ.పి.ఐ.యం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో భూములను కోల్పోయే పేద రైతులను కలిసి, ఆ భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలబై ఏండ్ల క్రితం బోళ్లు, గుట్టలుగా ఉన్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇస్తే, వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా రక్తం దారపోసి పంటలు పండిస్తున్న భూములను లాక్కొంటే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.
ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వందల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేసి ఏండ్ల తరబడి పడావ్ పెట్టిన వారి భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే చిట్యాల, చౌటుప్పల్ మండలాల గ్రామాలలో కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేసిన పాలకులు ఇక్కడి ప్రజలు కొత్త కొత్త రోగాల బారిన పడి చనిపోతున్నా పట్టించుకొనే నాధులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద రైతుల భూములను బలవంతంగా తీసుకోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోకపోతే రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్,అరూరి శీను, కత్తుల లింగస్వామి, దేశబోయిన స్వరూప, అరూరి శంభయ్య, మల్లం మహేష్, బీమిడి చంద్రారెడ్డి, జోగు లక్ష్మయ్య, అరూరి నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు గుర్రం జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ముందు గా భూములను కోల్పోయే రైతులు భూములకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని నిరశిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలని కోరుతూ పంచాయతీ కార్యాలయంలోకి గొర్రెలను పంపించారు.