క్రీడా పోటీల నిర్వహణ వల్ల గ్రామాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం అంకొలి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని, క్రీడాకారులకు నూతన క్రికెట్ కిట్టును అందించారు. అనంతరం ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ వల్ల యువకుల మధ్య స్నేహబంధం పెరగడంతో పాటు ఆటల పట్ల పట్టుదల పెరుగుతోందని అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం సైతం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, వైస్ ఎంపిపి రమేష్, టిఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీష్, గంగయ్య యాదవ్, రమణ కోడప సోనేరావు, తదితరులు పాల్గొన్నారు