వైసీపీ నాయకుడు, జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెయ్యని అరాచకం లేదు. మైనింగ్ అక్రమాల నుంచి మహిళలపై దాడుల వరకు అధికారం మాటున అన్ని నేరాలు చేసిన వల్లభనేని వంశీ ఇంతకాలం తప్పించుకు తిరిగాడు. ఇప్పుడు పాపం పండింది. నేరాన్ని చేసి ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి మరో నేరం చేయడం వైసీపీ నేతలకు అలవాటు. అదే విధంగా వల్లభనేని వంశీ ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి మరో ఘోరమైన నేరం చేసి పోలీసులకు దొరికిపోయాడు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.
వంశీ నేర సామ్రాజ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేవలం ఒక చిన్న అంశమే. అంతకు మించిన నేరాలు చేసిన ఘనుడు వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గంలో వంశీ నేతృత్వంలో వైసీపీ పాలనలో ప్రతి రోజు గొడవలు, దౌర్జన్యాలు, అక్రమాలు యథేచ్ఛగా జరిగాయి.
గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా ఆక్రమ మైనింగ్ జరిగినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వద్ద పనిచేసే కూలీలు, డ్రైవర్ల పేరుతో దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారం తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేశారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని, చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యంగా గన్నవరం, ఆగిరిపల్లి రోడ్డులో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని, రేమల్లె సహా పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు.
ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారని, అలాగే పట్టిసీమ కాలవ వద్ద కూడా మట్టి తవ్వారని గుర్తించారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేసినట్టు స్పష్టమైన ఆధారాలతో గుర్తించారు. రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించారు.
సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేసారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి పలువురు కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. త్వరలోనే వంశీని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన అనుచరుల అక్రమాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గన్నవరం విమానాశ్రయ భూముల్లో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
సంకల్ప సిద్ధి పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీం లో వల్లభనేని వంశి గ్యాంగ్ కోట్లు కొల్లగొట్టారు. సంకల్ప సిద్ది వ్యవహరంలో డబ్బులు పోగేసుకొని, మాజీ మంత్రి కొడాలి నానితో కలసి వంశీ బెంగళూరులో ఆస్తులు కొన్నాడు.
వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం ప్రాంతంలోని సహకార సొసైటీల్లో అనేక అక్రమాలు జరిగాయి. కోపరేటివ్ సొసైటీలను స్వతంత్రంగానే ఉంచాలని, ప్రతి రెండేళ్లకోసారి ఆడిట్ను తప్పనిసరి చేయాలని నిబంధన ఉన్నా వల్లభనేని వంశి పట్టించుకోలేదు సరికదా తన అనుయాయులకు వాటి ద్వారా దోచిపెట్టారు. అనర్హులకు ఉద్యోగాలిచ్చి అందులో ఉద్యోగాల స్కామ్ కూడా వంశీ చేశాడు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై పాశవికంగా దాడి చేయడమే కాకుండా ఆయనపైనా వందల మంది టిడిపి కార్యకర్తల పైనా అక్రమ కేసులు పెట్టించాడు.
అశోక్ లేల్యాండ్ కంపెనీ మూతకు కారణం వల్లభనేని వంశీనే.
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేశాడు
వంశీ దాష్టీకానికి భయపడిపోయి మేధా ఐటి టవర్స్ ఖాళీగా ఉండి పోయింది.
గన్నవరం ప్రాంతంలో క్యాసినో సంస్కృతి తీసుకువచ్చిన వంశీ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించాడు.
జగన్ అవినీతి, అరాచకాలను ప్రశ్నించిన NRI డాక్టర్ లోకేష్ కుమార్ని గన్నవరం ఎయిర్ పోర్టులో వంశీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడింది. పోలీసులం అని చెబుతూ అమెరికా పౌరుడైన డాక్టర్ లోకేష్ కుమార్ని అపహరించి అమానుషంగా ప్రవర్తించారు.
గన్నవరం వంశీ గూండాలు తెలుగుదేశం నాయకుడు దొంతు చిన్నా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. చిన్నా ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
గన్నవరంలో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకురాలు, ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై వంశీ గ్యాంగ్ దాడికి పాల్పడింది.