తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు వేయాలని అందుకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, చిమ్మపుడి గ్రామంలోని చెరువు పూడిక పనుల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు కూరగాయలు, బత్తాయి కాయలు, మాస్కులు, ORS ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఎక్కడ కూడా మొక్కజొన్నలు వేయకూడదని, పత్తి, కంది, మిర్చి వేయాలని సూచించారు. ముఖ్యంగా రఘునాధపాలెం మండలంలో వేసేదే పత్తి, మిర్చి అని అన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు పంటలు వేస్తేమంచి ఫలితాలు సాధిస్తామన్నారు.
ప్రభుత్వం కందికి పూర్తి మద్దతు ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తుందని అన్నారు. యాసంగిలోనే మొక్కజొన్న సాగు, వానాకాలం కంది, పత్తి పంటలు ఎక్కువ సాగుచేయాలని కోరారు. మొక్కజొన్న జోలికి పోవొద్దన్నారు. పంటల సాగుపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు.
ఏ ఏ జిల్లాలలో ఏఏ రకాలు పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం పంటల మ్యాప్ సిద్దం చేసి రైతులకు అందించనున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవసాయంపై ఇంత దృష్టి పెట్టలేదని, పంట వేయడం దగ్గర నుండి పంటలు అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.
3లక్షల టన్నుల వరి కొనుగోలు చేశాం. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి రైతు రావాలన్నది ప్రభుత్వ ద్యేయమన్నారు. నేడు దేశానికి మొత్తం అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నామని, తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. తెలంగాణ ఫలాలు దేశానికి అందించాలని, తెలంగాణ రైతు ఉన్నతస్థాయిలో ఉండాలని కేసీఆర్ ఆశయం.
ప్రతి ఎకరాన్నీ గోదావరి నీటితో తడుపుతాం
వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆరేళ్లలో కరంటు, సాగునీటి అవస్థలు తొలగించుకున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రాధాన్యతతో కూడిన రంగం వ్యవసాయం అని అందుకే ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలని పట్టుబట్టి కార్యాచరణ మొదలుపెట్టారని అన్నారు.
మనకు కనీస మద్దతుధర కాదు రైతులకు గిట్టుబాటు ధర కావాలని దృక్పధంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అటు బుగ్గవాగు ప్రాజెక్ట్, ఇటు సీతారామ ప్రాజెక్ట్ పనులు వడి వడిగా సాగుతుంన్నాయి. ప్రతి ఎకరానికి గోదావరి జలాలు అందించి రెండు పంటలు వేసే విధిగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి ఏకరాన్ని గోదావరి జలాలు త్వరలో పలకరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత మోగిలి, AMC చైర్మన్ వెంకటరమణ, MDO శ్రీదేవి, తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీపీ మలోత్ గౌరీ, జడ్పీటీసీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.