దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో జరిగిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సులోముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ నియంత్రిత విధానం వైపు మొగ్గుచూపేలా యంత్రాంగం కృషి చేయాలన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ను అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడం తో పాటు రుణమాఫీ చేసి అన్నదాతల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. రైతుబంధు పథకం దూరమౌతుందన్నది అపోహ మాత్రమనని రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబందు వస్తుందని స్పష్టం చేశారు. సబ్సిడీ విత్తనాలను అక్రమంగా అమ్ముకునే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
25వేల లోపు ఉన్న రైతుల రుణమాఫీ పూర్తయిందని, మిగితా మాఫీ నాలుగు కిస్తుల్లో జమ అవుతుందని తెలిపారు. పత్తి విత్తనాలు సరిపడా ఉన్నాయి, కరోనా వల్ల ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సోయా విత్తనాల కొరత ఉన్నపటికీ , రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూస్తామని చెప్పారు.
ఈసారి సిసిఐ కోటి పత్తి బేళ్లు కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. కరోనా సమయంలో కేంద్రం సహాయం చేయ రాష్ట్రం ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఆపడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నాందేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, జడ్పీ సీఈవో కిషన్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.