కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్ టెస్ట్ తప్పనిసరి అయినందున..పేద ప్రజలపై అధిక ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో సిటీ స్కాన్ టెస్ట్ ధరను డయాగ్నోస్టిక్ సెంటర్ లు 2వేల రూ. మాత్రమే తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా సిటిస్కాన్ యజమాన్యాలను కోరారు.
ఇందూరు సిటీ స్కాన్ యజమాని డా.రవీందర్ రెడ్డి, ఆర్మూర్ అమృత లక్ష్మీ సిటీ స్కాన్ డా.జయ ప్రకాష్ తో పాటు పలువురు సిటీ స్కాన్ యజమానులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. సిద్ధిపేట,సిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాలలో సి.టి. స్కానింగ్ కు రెండు వేలు తీసుకుంటున్నారని మన జిల్లాలో కూడా ఫిలిం తో రెండువేలు తీసుకొవలసినదిగా ఆయా యజమానులను కోరారు. ప్రస్తుతం ఒక్కో స్కానింగ్ కు నాలుగు నుండి 5 వేలు వసూలు చేస్తున్నారని కరోనా వంటి కష్ట సమయంలో ప్రజలపై అధిక భారం పడకుండా చూడాలని మంత్రి కోరారు.
యాజమాన్యాలతో మాట్లాడిన అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, DMHO తో ఫోన్ లో మాట్లాడారు.
2000 రూపాయలకే సిటీ స్కాన్ చేసేలా సిటీ స్కాన్ యాజమాన్యాలతో రేపు మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి వేముల కలెక్టర్, DMHO ను ఆదేశించారు.