గ్రామ ప్రజలు విద్యుత్ అధికారులకు బలిపశువులుగా కనిపిస్తున్నారని హుజూర్ నగర్ నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో ఏ గ్రామంలోనైనా ట్రాన్స్ఫార్మర్ లకు ఆన్ ఆఫ్ స్విచ్ ఉన్నాయా? అని అధికారులను నిలదీశారు.
హుజూర్ నగర్ శివారులోని గోపాలపురం గ్రామంలో ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య గ్రామంలో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా ట్రాన్స్ఫార్మర్లకు ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయలేదని, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని బెల్లంకొండ గురవయ్య అన్నారు.
ఈ గ్రామంలో రెండు ట్రాన్స్ఫార్మర్ లకు ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటే వాటిని ఎవరు బ్లాక్ చేశారు?అని అడిగారు. గ్రామంలో ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగితే ఆన్ ఆఫ్ స్విచ్ లేకపోవటం వలన దగ్గరలోని బూరుగడ్డ సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి ఎల్ సి తీసుకునే లోపే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది.
ఇలాంటివి జరిగితే విద్యుత్ అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.ఇకనైనా ఆలస్యం చేయకుండా గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ లకు ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలని సంబంధిత విద్యుత్ అధికారులను కోరారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై గ్రామ సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేశారు.