పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే దుర్మార్గమైన విధానంలో పెన్షన్లు తొలగించి రాష్ట్ర ప్రజలకు ఆవేదన మిగల్చడం బాధాకరమని కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. నేడు ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ లో పింఛన్లు అమలు చేసే తీరు చూస్తే వైసీపీ పాలన జగన్ ప్రభుత్వ విధాన వైఖరి ఒక ప్రాణం పోశా – ఒక ప్రాణం తీశా అన్నట్లుందని విమర్శించారు.
గతంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమా డైలాగును నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకునేలా ఉందన్నారు. పింఛన్ పొందే వారి వయోపరిమితి 65 సంవత్సరాలు ఉన్న దానిని 60 సంవత్సరాలకు తగ్గించి కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసి వివిధ కారణాలతో ఏకంగా ఏడు లక్షల మందికి పెన్షన్లు తొలగించడం దారుణమన్నారు.
గత నెల 13వ తేదీన జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలతో ఇంతకాలం పెన్షన్ తోనే బతుకు ఈడుస్తున్న వారిని ఒక్కసారిగా అనర్హులుగా ప్రకటించి కత్తి వేటు వేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. సాధారణంగా కొత్తగా ఏవైనా మార్గదర్శకాలు తీసుకొస్తే కొత్తగా చేరే అర్హులకు వర్తింపజేయాలి కానీ కొత్త వారికి, పాత వారికి అందరికీ కలిపి ఓకే నిబంధనలు వర్తింపచేయడంతో రాష్ట్ర ప్రజలు లక్షలాది మంది పెన్షన్లు కోల్పోయారన్నారు.
ఇప్పటికైనా ప్రజల నోటి కాడ కూడు తీసేయకుండా వైసీపీ ప్రభుత్వం చూడాలని ఇప్పుడు తీసేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పెన్షన్లు కల్పించాలని మీడియా మిత్రుల ద్వారా కోరారు. ఈ కార్యక్రమం ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాల్గొన్నారు. ఇంకా కౌంస్లర్ వెంకటేష్, గుగ్గిళ్ల చంద్రమౌళి, మన్నూరు రాజ, అదృష్ట దీప్తుడు, దరిమిశెట్టి వెంకటరమణ, చిన్నయ్య, రామచంద్రయ్య, రామయ్య, పాండురాజు, సుబ్బు,రె డ్డిశేఖర్, టి.యన్.యస్.ఎఫ్.జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.