ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు పర్యటనకు వెళ్లినా అక్కడ చెట్లు నరుకుతున్నారని, ఇది ప్రకృతికి తీరని శాపంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న చర్యలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.
ఇప్పుడు రెండు మూడు పర్యటనలతో సరిపెట్టుకుంటున్న సీఎం, వచ్చేది ఎన్నికల సమయం కావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటనలో చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనల కోసం రాష్ట్రం మొత్తం చెట్లు కొట్టేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యావరణ ప్రేమికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలతో జనమే కాకుండా చెట్లు కూడా ఘోషిస్తున్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు.