గత ఏడాది లాక్డౌన్లో ఏకంగా 1300కి.మీ సైకిల్పై జబ్బు పడిన తండ్రిని సైకిల్ వెనుక సీట్లో కూర్చోబెట్టుకుని వారం రోజుల పాటు సైకిల్ తొక్కి ఎట్టకేలకు స్వస్థలం దర్భంగాకు తండ్రితో పాటు సురక్షితంగా చేరుకుని సర్వత్రా ప్రశంసలుఅందుకున్న సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి ఇంట్లో విషాదం నెలకుంది. ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండె పోటుతో బిహార్లోని తమ స్వస్థలం దర్భంగాలో తుది శ్వాస విడిచాడు.జిల్లా మెజిస్ట్రేట్ డా.ఎస్ఎం త్యాగరాజన్ ఆయన మరణాన్ని ధ్రువీకరించారు.
సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి ఆ కుటుంబానికి అవసరమైన సాయం చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.జ్యోతి తండ్రి సాధారణ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్కు వెళ్లాడు. కూతురు జ్యోతి కూడా అతనికి చేదోడు వాదోడుగా అక్కడే ఉండేది. గతేడాది లాక్ డౌన్కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను గాయపడ్డాడు. సంపాదించే ఒక్కడూ మంచాన పడటంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయి.
గురుగ్రామ్లో తాము ఉంటున్న గదికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడే ఉంటే మున్ముందు తండ్రి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుందని జ్యోతి భావించింది.ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. అలా 7 రోజులు సైకిల్ తొక్కుతూ ఎట్టకేలకు గమ్యం చేరుకుంది. సంక్షోభ సమయంలోనూ అత్యంత ధైర్యంగా,సాహసోపేతంగా వ్యవహరించిన జ్యోతికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది.అమెరికా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక కూడా జ్యోతిని ప్రశంసించడం గమనార్హం.