పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం ఒమన్ ఇప్పుడు వరదలతో వణికిపోతోంది. అరేబియా సముద్రంలో తలెత్తిన షహీన్ తుఫాను ఇంకా తీరం దాటకముందే విలయ వాతావరణాన్ని సృష్టించింది. ఒమన్ రాజధాని మస్కట్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సాధారణంగా ఇసుక పరుచుకుని ఉండే మస్కట్ వీధులన్నీ జలమయం అయ్యాయి.
నడుములోతులో వరకు నీరు నదిని తలపిస్తోన్న వీడియోలు వైరల్ అయ్యాయి. మస్కట్ సహా తీర ప్రాంతాల్లో సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తీర నగరాల లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయించారు. తుఫాను దెబ్బకు విమాన సర్వీసులు ఎఫెక్ట్ అయ్యాయి. దాదాపు అన్ని విమానాల్ని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఒమన్ తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న షహీన్ తుఫాను.. మస్కట్ సమీపంలో ఆదివారం రాత్రికి తీరం దాటనుందని, ఆ సమయంలో తీరంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. మస్కట్ తోపాటు తీర ప్రాంతమైన దోఫార్ గవర్నరేట్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.