బ్రహ్మ కుమారీస్ ప్రధాన నిర్వాహకురాలు డాక్టర్ రాజయోగిని దాదీ జానకి పరమపదించారు. 104 సంవత్సరాల వయస్సులో ఆమె తన భౌతిక కాయాన్ని వదిలేశారు. రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద గ్లోబల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో నేటి తెల్లవారు జామున 2 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.
ఆమె అంత్య క్రియలు పూర్తయ్యాయి. మహిళా ప్రేరణ శక్తిగా ఎదిగిన రాజయోగిని దాదీ జానకి 1916 జనవరి 1న ఇప్పటి పాకిస్తాన్ లోని హైదరాబాద్ సింధ్ లో జన్మించారు. తన 21 వ ఏట బ్రహ్మకుమారి ఇనిస్టిట్యూట్ లో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం ప్రారంభించారు.
1970 లలో భారతీయ తత్వశాస్త్రం, రాజ యోగం, మానవ విలువలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఆమె పాశ్చాత్య దేశాలకు తరలి వెళ్లారు. ప్రపంచంలోని 140 పైగా దేశాల్లో వేలాదిగా ఆమె సేవా కేంద్రాలను నెలకొల్పారు. మనస్సు, ఆత్మ, బాహ్య పరిశుభ్రత అంశాలపై ఆమె స్థాపించిన బ్రహ్మ కుమారీస్ కేంద్రాలు ప్రపంచం మొత్తం మీద లక్షలాది మందిపై ప్రభావం చూపాయి.
భారత ప్రభుత్వం ఆమెను స్వచ్ఛ భారత్ మిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నామినేట్ చేసింది. ఆధ్యాత్మిక చింతనకు, ఉపాసనకు, ప్రపంచంలోని మానవుల శ్రేయస్సు కోసం ఆమె జీవితాంతం కృషి చేసింది.