రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన చారకొండ మండలంలో దళిత బంధు కార్యక్రమాన్ని 100% గ్రౌండింగ్ పూర్తిచేసి విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో 13 గ్రామ పంచాయతీల నుండి వచ్చిన 1338 మంది లబ్ధిదారులకు మార్చి 31 నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం చారకొండ మండల 13 గ్రామ పంచాయతీల జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులు దళిత బంధు వివిధ శాఖల,అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో చారకొండ మండల పరిధిలోని ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 1338 లబ్ధిదారులకు, మార్చి 31 నాటికి గ్రౌండింగ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పంచాయితీ నుంచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి కొటేషన్లను వెంటనే స్వీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వారంలో లబ్ధిదారులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. లబ్ధిదారుల నుండి జాబితాను ప్రత్యేక అధికారుల ద్వారా సేకరించిన, నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం లబ్ధిదారుల పూర్తి వివరాలను వెంటనే ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న వ్యాపారాల్లో మెరుగైన జీవన ఉపాధి పొందేలా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి యూనిట్ల పై అవగాహన కల్పించి చారకొండ మండలాన్ని రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా లబ్ధిదారులకు అవకాశాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆటోమొబైల్, గొర్రెలు, పాడి ఆవుల పెంపకం తో పాటు పాల ఉత్పత్తి డైరీ తదితర వ్యాపారులపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని, సూచించారు. లబ్ధిదారులు అందరికీ బ్యాంకు ఖాతాలు వెంటనే ఓపెన్ అయ్యేలా చూడాలని ఎల్ డి ఎం ను ఆదేశించారు. చారకొండ మండలానికి ప్రభుత్వం నుండి 59 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని గ్రౌండింగ్ ప్రక్రియ కావలసిన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్ లాల్, 13 గ్రామ పంచాయతీల జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్