తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు దళిత బంధు అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారని, ఇది దళితులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి అన్నారు.
ఆయన నేడు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తా అని కెసిఆర్ మాట తప్పారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను కొద్దికాలంలోనే తీసేసారు…ఎందుకు తీసేసారో ఇప్పటివరకు చెప్పలేదు..
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న నిధులను కూడా దారి మళ్లించారు..దళిత బంధువా.. దళిత వ్యతిరేకా ..అంటూ ఆయన ప్రజలను సూటిగా ప్రశ్నించారు. దళితులకి 65 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేదని కెసిఆర్ ఒప్పుకున్నారు..కెసిఆర్ నూటికి నూరుపాళ్లూ దళిత వ్యతిరేకేనని ఆయన తెలిపారు. చిత్త శుద్ధి ఉంటే దళిత సాధికారత స్కీమ్ ను ఓట్ల కోసమే కాకుండా ఒక స్కీముగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దళితులకి 32 వేల ఉద్యోగాలు రాకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు. హుజురాబాద్ లో ఓట్ల కోసమే పైలెట్ ప్రాజెక్టుగా దళిత సాధికారతపై స్కీమును పెట్టారని మల్లు రవి అన్నారు.