కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ వెలుగోడు లోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన దళితుల పై జరిగినదాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు కోరారు. కొందరు అగ్రకులస్తులు ఏకమై దళిత అంకరాజు కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్యని వారన్నారు.
కులవివక్షకు పాల్పడి దాడి చేసిన వారిని గ్రామ బహిష్కరణతో పాటు, అరెస్టు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా వెలుగోడు మండల తహశీల్దారు కార్యాలయం ఆవరణంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మండల తహశీల్దారు కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఇన్చార్జి తహశీల్దారు గురునాథం కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి తహశీల్దారు గురునాథం మాట్లాడుతూ నేటికీ దళితులపై దాడి జరగడం బాధాకరమన్నారు.
విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విచారణ చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. మాల మహానాడు నంద్యాల డివిజన్ నాయకులు పెరుమాళ్ల రాముడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా నేటికీ గ్రామాల్లో అంటరానితనం అస్పృశ్యత , అగ్రకులస్తులు దళితులపై దాడు చేయడం దారుణమన్నారు.
దాడికి కారణమైన నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు. మరొకరు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రామదాసు మాట్లాడుతూ గతంలో లో చుండూరు వేంపెంట గ్రామాల తరహాలో దాడి జరిగిన సంఘటనాలా ఉందని, కాబట్టి బాధితులకు రక్షణ కల్పించడం తోపాటు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని , ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పరిస్థితులను తెలుసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు.