డంపింగ్ యార్డ్ సమస్యపై హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నబాగ్ అంబర్పేట్ డివిజన్ లోని బతుకమ్మ కుంట ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా చెత్త డంపింగ్ యార్డ్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అనారోగ్య సమస్యలకు గురిఅవుతున్నామని వారు అంటున్నారు.
అయినా జిహెచ్ఎంసి అధికారులు ఆ డంపింగ్ యార్డ్ ప్రదేశాన్ని రాంకీ సంస్థకు ధారాదత్తం చేశారు. రాంకీ సంస్థ ఆ డంపింగ్ యార్డ్ సామర్ధ్యం పెంచుతున్నది.
దీంతో స్థానిక బతుకమ్మ కుంట, నందనవనం, సాయి మధురానగర్ కాలనీవాసులు అభ్యంతరం చెబుతూ ధర్నాకు దిగారు. తీవ్రమైన దుర్వాసనతో విపరీతమైన దోమలతో అనారోగ్యాల పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నామని వారు అంటున్నారు.
ఇరవై రోజుల క్రితం ఇదే డంపింగ్ యార్డ్ ప్రదేశంలో రోడ్డుపై సులబ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని రావడంతో స్థానికులు అభ్యంతరం చెప్పారు. అప్పుడు వెనుదిరిగిన జిహెచ్ఎంసి అధికారులు ఇప్పుడు మరొక ఎత్తుగడ వేశారు. మునిసిపల్ అధికారుల చర్యలను స్థానికులు ఖండిస్తున్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మి శెట్టి బాలరాజు, అచ్చనీ రమేష్, కె శ్రీహరి, శేఖర్, సిపిఎం నాయకులు మహేందర్, ఏసు, కాంగ్రెస్ నాయకులు సాయికిరణ్, నజీర్, స్థానిక బస్తీవాసులు గిరిధర్ గౌడ్, హరి కృష్ణ, హేమంత్ కుమార్, శేఖర్ గౌడ్, సత్యనారాయణ, అనిల్, శ్రీనివాస్, గువ్వ శశిధర్,,కిషోర్ అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.