నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం గణపతి పూజ అనంతరం అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డివారి శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు నిర్వహిస్తారు.
అదే విధంగా లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం జరుపుతారు. ప్రతి రోజూ భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకారం ఉంటుంది కాగా ఈ రోజు భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం నిర్వహించారు. అదే విధంగా స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు. అక్టోబరు 5వ తేదీతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.