దసరా మహోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉదయం భ్రమరాంబ దేవి అమ్మవారికి ప్రాతఃకాల పూజలు విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు జరిపించబడ్డాయి. అలాగే నవదుర్గ అలంకారంలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని బ్రహ్మచారిని రూపంలో అలంకరించారు. మయూర వాహనసేవలో భాగంగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధులలో నందీశ్వరుడు వెంటరాగా మేళతాళాలతో గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది.
ప్రత్యేక పుష్పాలతో చేసిన అలంకరణలు, దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మఠం విరూపాక్షయ స్వామి దంపతులు తదితరులు పాల్గొన్నారు.