శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (ఆదివారం) నాడు అమ్మవారు భక్తులకు స్వర్ణకవచ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ కనకదుర్గమ్మను దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చే రోజున అమ్మవారికి చక్రపొంగలి, కట్టెపొంగలిని నివేదిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి దుర్గగుడి అధికారులు అనుమతిచ్చారు సీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు కుంకుమార్చనలో పాల్గొన్నారు
previous post
next post