ఒక ఐపిఎస్ అధికారి ఫామ్ హౌస్ లో మేనేజర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ లోని అత్తారి, సూర్తిఖేడా గ్రామాల మధ్య ఉన్న ఫామ్ హౌస్ లక్నోలో పని చేస్తున్న ఐపిఎస్ అధికారి బికె మౌర్యాది. ఈ ఫామ్ హౌస్ లో విజయ్ కుమార్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతడు ఫామ్ హౌస్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఫామ్హౌస్లోని మామిడి చెట్టుకు అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఫామ్హౌస్లో ఉన్న మామిడితోటలో చెట్టుకు విజయ్ మృతదేహం వేలాడుతూ ఉండడాన్ని గ్రామస్తులు చూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే గ్రామంలో తీవ్ర ఉద్రికత్త చెలరేగింది. కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న మలిహాబాద్ ఏసీపీ అనింద్య విక్రమ్ సింగ్, మాల్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పిలిపించారు.
ఐపిఎస్ అధికారి మౌర్య కూడా ఫామ్హౌస్కు చేరుకుని, మృతుల కుటుంబ సభ్యులకు న్యాయమైన విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. మృతుడి సోదరుడు దుర్గేష్, సోదరి శాంతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం విజయ్కు విషమిచ్చి హత్య చేసేందుకు కొందరు ప్రయత్నించారు. విజయ్ సోమవారం రాత్రి కొంతమంది స్నేహితులతో కలిసి సస్పన్ పులియాలో ఉన్న దుకాణంలో పరాటా రోల్స్ తినడానికి వెళ్లాడని కూడా వారు చెప్పాడు. రాత్రి బస చేసిన విజయ్తో మరొక ఒక యువకుడు ఉన్నాడని వాచ్మెన్ మెహెర్బాన్ చెప్పాడు. హత్యేనని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని మృతుడి సోదరుడు గంగారాం డిమాండ్ చేశారు. విజయ్ కుటుంబంలో ఎనిమిది మంది తోబుట్టువులు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపారు.
గ్రామస్తుల కథనం ప్రకారం దశాబ్దం క్రితం ఈ ఫామ్హౌస్ వాచ్మెన్ను దుండగులు గొంతుకోసి హత్య చేశారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు మాల్ పోలీసులు వెల్లడించలేదు. గ్రామస్తులు ఈ రెండు ఘటనలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి చూస్తున్నారు.