నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు మార్చి 3 వ తేదీన 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. ముఖేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31) అనే నలుగురు దోషులపై అదనపు సెషన్ జడ్జి ధర్మేందర్ రాణా తాజాగా వారెంట్లు జారీ చేశారు.
జనవరి 22 వ తేదీన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని తొలి సారి డెత్ వారంట్ జారీ చేయగా జనవరి 17న కేసు విచారించి దాన్ని ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే మళ్లీ జనవరి 31న కేసు విచారణకు వచ్చి తదుపరి ఉత్తర్వలు వెలువడే వరకూ ఉరి శిక్షవాయిదా వేశారు.
బాధితురాలి తల్లి ఆశా దేవి నేటి ఉత్తర్వులపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె “చాలా సంతోషంగా ఉంది ఇది మూడవ సారి డెత్ వారెంట్ జారీ అయింది” అని చెప్పారు. “మేము చాలా పోరాటం చేశాం, కాబట్టి చివరికి డెత్ వారెంట్ జారీ అయిందని సంతృప్తి పడుతున్నాను. మార్చి 3 న వాటిని అమలు చేస్తారని ఆశిస్తున్నాను ‘ అని ఆమె పేర్కొంది. ఇదిలావుండగా, తాజా మరణ వారెంట్లను జారీ చేయాలన్న నిర్ణయంపై అపరాధుల కుటుంబాలు నిరసన తెలిపాయి.