దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు పటిష్ట కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాలను 21 రోజులపాటు నిర్వహించుటకు
నిర్ణయించిందని, రోజువారి కార్యక్రమాలు సూచించిందని అన్నారు. హరితహారం కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టాలని, ప్లాంటేషన్ స్థలాలను గుర్తించి, ప్లాంటేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోడు పట్టాలను సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెల 24 నుండి పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు, ఆర్వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు
ఇవ్వాలని, వ్యవసాయ అధికారులు రైతుబంధు మంజూరుకు కావాల్సిన పత్రాలను పొందాలని ఆయన తెలిపారు. జీవో 59 క్రింద ఇప్పటికి 300 మందికి టైటిల్ ఇచ్చినట్లు, వారిలో ఎంత మందికి బ్యాంక్ రుణాలు పొందారో వివరాలు సమర్పించాలన్నారు. పంపిణీకి వున్న ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీకి ప్రతిపాదనలు చేయాలన్నారు.
దళితబంధు రెండో విడత యూనిట్ల మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7 శాఖల్లో 348 మంది ఎన్ఎంఆర్ సిబ్బంది పనిచేస్తున్నట్లు, వారికి కార్పొరేషన్ పరిధిలో రూ. 499, మునిసిపల్, నాన్ మునిసిపల్ పరిధిలో రూ. 451, ఏజెన్సీ పరిధిలో రూ. 723 లు దినసరి భత్యం చెల్లిస్తున్నట్లు, ద్రవ్యోల్బణం దృష్ట్యా 20 శాతం వేతనం పెంపుకు చర్యలు చేపట్టాలన్నారు.