అధికార వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లు (మూడు రాజధానుల బిల్లు)ను నేడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి లో ‘‘తిరస్కరించినా ఇబ్బందిలేని’’ సెక్షన్ల కింద ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఒక సారి శాసన సభ ఆమోదించిన ఈ బిల్లును శాసన మండలికి పంపింది.
తెలుగుదేశం పార్టీ మెజారిటీలో ఉన్న శాసన మండలి లో బిల్లును తిరస్కరించకుండా, ఆమోదించకుండా సెలక్టు కమిటీకి పంపారు. శాసన మండలి తిరస్కరిస్తే అసెంబ్లీ మళ్లీ ఆమోదించుకుంటే ఆ బిల్లు పాస్ అయినట్లే భావించాల్సి ఉంటుంది. అధికార వైసీపీకి ఆ వెసులుబాటు కల్పించకుండా తెలుగుదేశం పార్టీ బిల్లును సెలెక్టు కమిటీకి పంపింది. దాంతో బిల్లు మూలన పడింది.
కౌన్సిల్ ఈ బిల్లును సెలెక్టు కమిటీ కి పంపినా ఆ నిర్ణయం అమలు కాలేదు. మూడు నెలలు గడచిపోయినందుకు సెలెక్టు కమిటీకి పంపాలనే నిర్ణయం వీగిపోయినట్లే అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పుడు తాజాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం బిల్లును ప్రవేశ పెట్టారు.
ఈ అధికరణ ప్రకారం శాసన మండలి ఆమోదించినా, తిరస్కరించినా ఇబ్బంది లేదు. మళ్లీ సెలెక్టు కమిటీకి పంపే అవకాశం లేదు. ఒక నెల రోజుల పాటు కౌన్సిల్ ఏ నిర్ణయం ప్రకటించకపోతే బిల్లు ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. ఈ కారణంగా ఇక మూడు రాజధానుల బిల్లు దాదాపుగా ఉభయ సభల ఆమోదం పొందినట్లే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా మరో నెల రోజులకైనా మూడు రాజధానుల బిల్లు చట్టంగా మారుతుంది.
అయితే ఇప్పటికే సెలెక్టు కమిటీకి పంపినందున ఇప్పుడు మళ్లీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటం చేస్తున్నది. కేసు కోర్టులో ఉన్నందున ఆ తీర్పు వచ్చే వరకూ ప్రభుత్వం ఆగుతుందా లేక అసెంబ్లీ బిల్లు ఆమోదం పొందడం, కౌన్సిల్ లో ఆమోదం పొందినట్లుగా భావించడం జరిగిన వెంటనే మూడు రాజధానుల విషయాన్ని ముందుకు తీసుకువెళుతుందా అనేది వేచి చూడాలి.
హైకోర్టు తీర్పు కోసం వేచి చూడకుండా బిల్లు ఆమోదం పొందిందని ముందుకు వెళితే మళ్లీ కోర్టు ధిక్కార నేరం కింద కేసు ఎదురోవాల్సిన ప్రమాదం ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.