పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు మోహరించినా హింసాత్మక ఘటనలు అదుపులోకి రావడంలేదు. మంగళవారం కూడా ఈశాన్య ఢిల్లీలోని పలు చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయి రాళ్లు రువ్వారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కీలక భేటీ నిర్వహించారు. ఢిల్లీలో నిన్నటి నుంచి జరిగిన హింసలో ఇప్పటివరకు ఓ హెడ్ కానిస్టేబుల్తో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా నిర్వహించిన ఈ కీలక భేటీలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా, బిజెపి నేత మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
హింస చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మరోవైపు, హింసాత్మక ప్రదేశాల్లో మరిన్ని పోలీసు బలగాలను మోహరించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్రహ్మపురి, చాంద్పూర్, కార్వాల్నగర్, మౌజ్పూర్ సహా పలు ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరించనున్నారు