జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ర్ట సమితి, భారతీయ జనతాపార్టీలు ఢీ అంటే ఢీ అనేలా పోటీనిచ్చాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎన్నికలు కాస్త సద్దుమణిగాక రాష్ర్టంలోని పలు అభివ్రద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు (శుక్రవారం) ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ కోసం కేంద్రం 1100 వందల గజాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ స్థలాన్నిపరిశీలించి దాని నిర్మాణానికి కూడా తగిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అంతేగాకుండా రాష్ర్టానికి రావాల్సిన నిధులపై కూడా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు లేక మూడు రోజులపాటు ఉండనుందని తెలుస్తోంది.
ఎన్నికల్లో ఉప్పు-నిప్పులా ఇరు పార్టీల తీరు కొనసాగిప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కేంద్ర పార్లమెంట్ భవనంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ పార్లమెంట్ భవనం రూపురేఖలపై పలు సూచనలు చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఆయా విషయాలపై కూడా సీఎం కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల అనంతరం సీఎంకేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. కాగా ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వెళ్ళనున్నట్లు సీఎంవో కార్యాలయ అధికారుల ద్వారా తెలిసింది.