రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సూర్యకుమారి హితవు
ప్రపంచంలోనే అత్యున్నత విలువలు కలిగిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని భావతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందురోజే కలెక్టర్ పార్వతీపురం వెళ్లారు. ముందుగా ఆమె మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణరావు, ఇతర అధికారులతో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసల ఫలితంగా మనకంటూ ఒక రాజ్యాంగం అందుబాటులోకి వచ్చిందని, దీని వెనుక ఎంతోమంది కృషి దాగి ఉందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను పాటించాలని, తమ కర్తవ్యాలను, విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలయ్యిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ తమ విధులను అంకిత భావంతో నిర్వర్తించాలని తద్వారా శతశాతం విధులకు నాయ్యం చేసిన వారవుతారని పేర్కొన్నారు. స్వచ్ఛతా విలువలు పాటించటంలో బొబ్బిలి మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమన్నారు. మున్సిపల్ ఛైర్మన్ సావు వెంకట మురళృకృష్ణరావు మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కృషి, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. అలాంటి మహనీయుడ్ని మరొక్కసారి మనమంతా స్మరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసరావు, ఎంపీడీవో, తహశీల్దారు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.