సిద్దిపేట, దుబ్బాక లు తనకు రెండు కళ్ళ లాంటివి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దుబ్బాక ప్రజలకు అన్నీ వేళలా అందుబాటులో ఉండి సిద్దిపేట మాదిరే దుబ్బాక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
బుధవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అధునాతన ట్విన్ టాయిలెట్స్ ను, రూ.85 లక్షలతో నిర్మించిన వెజ్, నాన్ -వెజ్ మార్కెట్ ను మంత్రి ప్రారంభించారు.
ఆ వెంటనే రూ.80 లక్షలతో పలు వార్డులలో నిర్మించనున్న మురుగు కాల్వల నిర్మాణం పనులకు మంత్రి శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత సంవత్సరం చింతమడక వచ్చినప్పుడు దుబ్బాక పై ప్రేమతో రూ.10 కోట్ల ప్యాకేజీని ప్రకటించారన్నారు. గతంలో కూడా రూ.25 కోట్ల ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు.
దివంగత శాసన సభ్యులు రామ లింగా రెడ్డి కోరిక మేరకు ఫైర్ స్టేషన్ ను మంజూరు చేశారని అన్నారు. దుబ్బాక పాత పట్టణం చిన్న చిన్న గల్లీలు, రాళ్లతో కట్టిన మురుగు నీటి కాల్వలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
వార్డుకు రూ.10 లక్షలు వెచ్చించి పాత మురుగు నీటి కాల్వల స్థానంలో RC మురుగు నీటి కాల్వల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గతంలో దుబ్బాక లో తీవ్ర తాగు నీటి సమస్యలు ఉండేవన్నారు.
మహిళలు ట్యాంకర్ల వెనుక పరిగెత్తి త్రాగు నీటి నీ తెచ్చుకునే వారన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందా మన్నారు. 70 ఎండ్లుగా దుబ్బాక నియోజక వర్గం ప్రజలు సాగునీటి , త్రాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారని మంత్రి అన్నారు.
ఇప్పటికే త్రాగునీటి సమస్యలకు పరిష్కారం చూపగా త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే దాదాపుగా దుబ్బాక నియోకవర్గo లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
వచ్చే 7 నెలల్లో పిల్ల కాల్వల పనులు పూర్తి చేసి నియోజక వర్గంలో 1 లక్షా 35వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని మంత్రి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో 20 వేల మంది బీడి కార్మికులకు జీవనభృతి అందిస్తున్నామన్నారు.
గతంలో రెండు వందల పింఛన్ను రెండువేలకు పెంచిన ఘనత తమదేనన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 56,906 మంది వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.