గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే కుల వృత్తుల ప్రోత్సాహానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
పాలేరు జలాశయంలో 2 లక్షల చేప పిల్లలు వదిలిన మంత్రి
చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి 2లక్షల చేప పిల్లలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే అన్ని చెరువులు, కుంటల్లో చేపపిల్లలు పంపిణీ చేపట్టామన్నారు. ప్రభుత్వం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 22కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయగా ఈ ఏడాది 70కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా
ఉన్న అన్ని కుంటలు, చెరువులు, జలాశయాలలో చేప పిల్లలను వేసేందుకు మత్స్య శాఖ ద్వారా పంపిణీ చేయడమైందన్నారు. ఈ ఏడాది జిల్లాలోని చెరువులలో 3.45 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు.
జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వాతంత్య్రం కోసం సమిష్టి కృషి చేయాలన్నారు. చేపపిల్లల నాణ్యత, సంఖ్య విషయంలో రాజీ పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మత్స్యకార సంఘాలు చెరువుల్లో వదలకముందే సంఖ్య, నాణ్యత విషయంలో సరిచూసుకోవాలన్నారు.
సబ్సీడీపై వాహనాలు
మత్స్యకారులకు సబ్సిడీపై టాటా ఏస్, మోపెడ్ వాహనాలను అందిస్తున్నామన్నారు. చేపలను అమ్ముకునేందుకు రూ.20వేల విలువ గల మొబైల్ టెంట్లను రూ. 5వేలకే ఇవ్వడమైందని మంత్రి తెలిపారు.
అనంతరం పాలేరు పార్కును సందర్శించారు. కోవిడ్ లో భాగంగా పార్కు మూసివేశరని పార్కు కలతప్పిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం మళ్ళీ ప్రజలకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మత్స్య శాఖ అధికారులు, సర్పంచ్, జడ్పీటిసి, ఎంపీటీసీలు, అధికారులు ఉన్నారు.