రాష్ట్రంలో ప్రజలు అసహ్యించుకునే నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నదని ప్రతిపక్షనాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. అందుకే సర్కార్పై ప్రజలతో కలిసి న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర భవిష్యత్ కోసం ఉద్యమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగేతర నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ సర్కార్ రాజధానుల తరలింపుపై పెట్టే శ్రద్ధ కరోనా వైరస్పై పెడితే ఎన్నో ప్రాణాలు నిలిచేవని చెప్పారు. రాష్ట్రంలో మద్యం పాలసీ విధానం వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయని, ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు.
అమరావతి రాజధానిని తరలించేందుకు అనేక అబద్ధాలు ప్రచారం చేశారని, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలన్నారు. మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధికి విఘాతం తథ్యమని చంద్రబాబు చెప్పారు. ‘టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అనేక అభివృద్ధి పనులు మంజూరు చేశాం.
విశాఖ అభివృద్ధికి అనేక సంస్కరణలు తెచ్చాం. రాయలసీమలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేశాం. రాయలసీమలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాన్ని ఎంతో డెవలప్ చేశాం అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ 14 నెలల్లో అభివృద్ధి శూన్యం. ఏపీలో చట్టాలను తుంగలో తొక్కుతున్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.