కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తుకు ఏపి డిజిపి ఆదేశించారు. నంద్యాల పట్టణంలో వి5 స్థానిక కేబుల్ ఛానల్ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న కేశవ, అతని సహ ఉద్యోగి ప్రతాప్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్, అతడి సోదరుడు తమను ఆపారని విలేకరి మిత్రుడు ప్రతాప్ తెలిపారు.
మాట్లాడాలని పిలవడంతో బైక్పై ఉన్న కేశవ పక్కకు వెళ్లారన్నారు. ఇంతలో ఒక్కసారిగా కానిస్టేబుల్ తమ్ముడు స్క్రూ డ్రైవర్తో కేశవ శరీరంపై ఎనిమిది సార్లు పొడిచారు. తీవ్ర గాయాలైన కేశవను అతని మిత్రుడు ప్రతాప్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మట్కా వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఓ వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్కు గురైన కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య వాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో పాటు హత్య తో ప్రమేయం ఉన్న అందరినిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి డిజిపి ఆదేశాలు జారీ చేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి సూచించారు.