నల్లగొండ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి అధికారుల ఆధ్వర్యంలో తీసుకుంటున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం ఆర్థికంగా నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పిస్తూనే నకిలీ విత్తన విక్రయదారుల సమాచారం సేకరిస్తున్నామని, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెంచడంతో పాటు గత సంవత్సరం కేసులు నమోదు చేసిన వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు.
నకిలీ విత్తన విక్రయదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, పి.డి.యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ సి. నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోదగిరి, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, సిఐలు రవీందర్, నిగిడాల సురేష్, అంజయ్య, సురేష్ బాబు, ప్రభాకర్ రెడ్డి, నాగేశ్వర్ రావు, తదితరులున్నారు.