ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన “యోగవాశిష్ట శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణం ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వరకు 62 రోజుల పాటు కొనసాగి బుధవారం ముగిసింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోని భక్తులు పెద్దసంఖ్యలో అనుసరించి తమ ఇళ్లలో పారాయణం చేశారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఈ పారాయణం జరిగింది.
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, సివిఎస్వో గోపినాథ్జెట్టి ఇతర విభాగాధిపతులు ఈ పారాయణంలో పాల్గొన్నారు. ఈ పారాయణం 60వ రోజుకు చేరుకోగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగాత్మకంగా స్వామివారి దర్శనం ప్రారంభమైంది. చివరి రోజైన బుధవారం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి ఆధ్వర్యంలో గోవిందనామాల పారాయణం అద్భుతంగా జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, గురజాడ మధుసూదనరావు, రఘునాథ్, బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 11 నుండి సుందరకాండ పారాయణం
తిరుమలలో జూన్ 11వ తేదీ నుండి భక్తులకు దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణం ప్రారంభం కానుంది. ఉదయం 7 నుండి 8 గంటల వరకు జరుగనున్న ఈ పారాయణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.