తెలంగాణలో స్వార్థం కోసం గత పాలకులు ధరణి అనే మాయదారి చట్టాన్ని తెచ్చారని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గతంలో తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు, కష్టపడి కొనుకున్న భూములు, ప్రభుత్వం ద్వారా పేదలకు ఉచితంగా ఇచ్చిన పోరంబోకు భూములు, విలువైన ప్రభుత్వ భూములు మాయదారి ధరణి చట్టం వల్ల అన్యాక్రాంతం అయ్యాయని మంత్రి అన్నారు.
భూ భారతి చట్టం – 2025 పై పానగల్ మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫిర్యాదులు చేద్దామంటే ధోరణిలో అవకాశాలు లేవన్నారు. అందువల్ల ధరణిలో వచ్చిన ఇబ్బందులు, ప్రజలకు అండగా ఉండాలని భూ భారతి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని 60 రోజుల గడువు కలెక్టర్ కు ఉంటుందన్నారు. త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందని, భూ రికార్డులు పక్కగా భద్రపరచడం జరుగుతుందన్నారు.
చిన్నంబావి, పానగల్ లో జరిగిన భూ కబ్జాలను తిరిగి ప్రభుత్వ భూమిగా గుర్తించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల పై ఉందన్నారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఏ చట్టం తీసుకువచ్చిన చట్టం పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని అందుకే కొత్తగా వచ్చిన భూ భారతి ఆర్. ఒ.ఆర్. చట్టంపై మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇతరుల భూ రికార్డులు కావాలి అనుకుంటే తహసిల్దార్ సర్టిఫై తో వివరాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
అంతకుముందు భూ భారతి చట్టం గురించి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. డి.సి.సి.సి.బి జిల్లా అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ చట్టం గురించి ప్రజలకు వివరించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఇంచార్జ్ యాదయ్య, డి ఆర్ డి ఓ పిడి ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తహసిల్దార్, ఎంపీడీఓ, మాజీ మండల ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్