రెవెన్యూ సంస్కరణల్లో ధరణి పోర్టల్ భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలవనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గంలోనే తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి అల్లోల లబ్ధిదారుకు అందించారు. పాక్ పట్ల గ్రామానికి చెందిన మహేశ్వరికి డిజిటల్ సంతకంతో కూడిన గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ధరణి పోర్టల్ సేవలను అందుబాటులోకి తేవడంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ సంస్కరణలను ఇతర రాష్ట్రాలు ఫాలో అయ్యే అవకాశం ఉందన్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని, స్మార్ట్ ఫోన్ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.
ఇది వరకు రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ను సంప్రదించి, కొంత నగదును కమిషన్ రూపంలో ఇస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితంగా అయ్యేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. కొనుగోలు/అమ్మకందారుడెవరైనా నేరుగా స్మార్ట్ఫోన్ ద్వారా స్లాట్బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులిరువురితోనే అర గంటలో పూర్తయ్యేలా ధరణి పోర్టల్ తో అన్ని సేవలు పారదర్శకంగా ఉంటాయని, భూముల క్రయవిక్రయదారులు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా, స్వేచ్ఛగా ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు… పోర్టల్ నమోదుకు అయ్యే ఖర్చు తప్ప… ఏ ఒక్కరికీ రూపాయి ఇవ్వకుండానే భూ పత్రాలు హక్కుదారులకు అందుతున్నాయని వెల్లడించారు.
గతంలో భూ బదలాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకునేవని….. ధరణి పోర్టల్ తో భూ హక్కుదారులు ఒక్క ఇంచు భూమి కూడా కొల్పోయే ఆస్కారం లేదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులిరువురితోనే పూర్తయ్యేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.