జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధిపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధికి ముఖ్యమంత్రి 120కోట్లు మంజూరు చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప దైవభక్తులని,ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మన ఆలయాలను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు.
యాదాద్రిని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని, వేములవాడ, ధర్మపురి దేవస్థానాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను భక్తిప్రపత్తులు,శ్రద్ధాసక్తులతో చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్ధాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో పురాతన లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం నెలకొని ఉండడం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి కొప్పుల ప్రాతినిథ్యం వహిస్తుండడం తెలిసిందే. ఈ దేవస్థానం పునః నిర్మాణం, విస్తరణ, అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 120కోట్లు కేటాయించగా,ఇందులో మొదటి విడతగా రూ.61కోట్ల66లక్షలు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆలయం అభివృద్ధికి సంబంధించిన నమూన,ప్రతిపాదనలు, ప్రణాళిక,చేపట్టిన, చేపట్టవలసిన చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలిచ్చారు. స్వామి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తున్నారని, ఆలయాన్ని, పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్దడం,మరిన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా వేల మంది తరలి వస్తారన్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, గోదావరిలో ఘూట్ల విస్తరణ, అభివృద్ధి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నమూన,ప్రతిపాదనలపై పలు చేర్పులు,మార్పుల గురించి సూచనలు చేశారు.దేవస్థానం విస్తరణకు కావలసిన భూసేకరణ, పునః నిర్మాణానికి సంబంధించి పురాతత్వ శాఖల అవసరమైన అనుమతులు వచ్చేలా, టెండర్ స్థాయికి వెళ్లేలా తగు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు.
సమావేశంలో దేవాదాయ శాఖ ఇఇ రాజేష్,ఆలయ ఇవో సంకటాల శ్రీనివాస్,డిఇ రఘునందన్, అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.