జగిత్యాల భారతీయ జీవిత భీమా సంస్థ ఎదుట లియాపి ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. జిఎస్ టి కి వ్యతిరేకంగా, ఇన్సూరెన్స్ వ్యవస్థ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లేకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. లియాపి అధ్యక్షులు ఎనుగుర్తి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లాలోని 14 మండలాల ఏజెంట్లు, కొందరు పాలసీ దారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ ఇన్సూరెన్సు పాలసీలపై జిఎస్ టి ని ఎత్తివేయాలని, పాలసీదారులకు బోనస్ పెంచాలని, ఏజెంట్ల గ్రాట్యుటీని పెంచాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య మాట్లాడుతూ గ్రూప్, టర్మ్ ఇన్సూరెన్స్ లను పెంచాలని, క్లబ్ మెంబర్స్ కుటుంబ సభ్యులకు అందరికీ ఇన్సూరెన్స్, ఆరోగ్య భీమా వర్తింపజేయాలన్నారు. పెంచిన ఏజెంట్ల కమిషన్ వెంటనే అమలు చేయాలని, ఏజెంట్ల అలవెన్సులను పెంచాలని కోరారు. స్వావలంబన్, సంవర్ధన్ వివరాలను వెంటనే అందజేయాలన్నారు.
పాలసీల లాప్సేషన్, ఎస్కలేషన్ ఎత్తి వేయాలని, ఆరోగ్య భీమా, గ్రూప్ భీమా జీవితాంతం వర్తింప జేయాలన్నారు. ఈ ధర్నాలో ఏజెంట్ల సమాఖ్య నాయకులు బొడ్ల వీరేశం, గుండా నాగరాజు, చుక్క గంగారెడ్డి, గంగాధర్, రాజ్ కుమార్, ప్రభాకర్, లక్మన్, గంగారెడ్డి, రామచంద్రం, జలపతి, హన్మంత్ రెడ్డి, కనకయ్య, రాజన్న, రాజేశం, వెంకటి, రమేష్, కమలాకర్, రవి, నర్సయ్య, గంగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.