రాష్ట్రంలో ఉన్న నలుగురు మహిళా మంత్రులు సఖ్యత లేకుండా వ్యవహరిస్తుండటంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మహిళా సమస్యలు ప్రస్తావనకు వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు కానీ నలుగురు మహిళా మంత్రులు కలిసి వ్యూహం రూపొందించుకుని ప్రతిపక్షాలను ఎండగట్టడం చేయడం లేదు. దీనివల్ల పార్టీకి ఇబ్బంది ఎదురవుతున్నదని సీఎం భావిస్తున్నారని అంటున్నారు.
ఒక్క రోజా తప్ప మిగిలిన ముగ్గురు ప్రతిపక్షాల విమర్శలకు స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ మహిళా మంత్రులు ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న పార్టీ వర్గాలే వేస్తున్నాయి. ఈ నలుగురు మహిళా మంత్రులు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండటం పక్కన పెడితే వారి వారి సొంత జిల్లాల్లోని మిగిలిన నాయకులతో కూడా వీరు కలివిడిగా ఉండటం లేదు. ఇది కూడా పార్టీకి తీరని నష్టం చేకూరుస్తున్నదని వైసీపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. మంత్రి రోజాకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల నుంచే సమస్యలు ఉన్నాయి.
రోజా వ్యవహార శైలిపై స్థానిక నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వ్యవహారశైలిపై అక్కడి నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఒంటెత్తు పోకడలతో మంత్రి రజని పార్టీకి నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. అదే విధంగా ఎవరితో కలవకుండా ఉండిపోతున్న రాష్ట్ర హోం మంత్ర తానేటి వనిత, ఉషశ్రీ చరణ్ లు కూడా మంత్రులుగా తమకు అందుబాటులో ఉండటం లేదని పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు.
జిల్లాలోని ఇతర నాయకులతో పడకపోవడమే కాకుండా తమలో తాము కూడా చర్చించుకుని ప్రతిపక్షాలను ఎదుర్కునే వ్యూహాలను రూపొందించడంలో నలుగురు మహిళా మంత్రులు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. మంత్రి విడుదల రజని తనను తానుగా ఎక్కువ ఊహించుకుంటూ తనంటే ఇష్టం కాబట్టే తనకు ఎంతో ప్రాధాన్యతగల శాఖ ఇచ్చారని అనుకుంటున్నారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
అధిష్టానంతో సఖ్యతగా ఉన్నంత కాలం పక్కనాయకులను పట్టించుకోకపోయినా ఫర్వాలేదన్నట్లు మంత్రి రజని వ్యవహరిస్తున్నారని పల్నాడు జిల్లా నాయకులు అంటున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ మొక్కుబడిగా తప్ప మనస్ఫూర్తిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడంలేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకరితో ఒకరికి పొసగకుండా కూడా ఈ నలుగురు మహిళా మంత్రులు వ్యవహరిస్తుండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం అయింది.
నలుగురు మహిళా మంత్రులపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాజకీయ అంశాలను ఒక్క రోజా మాత్రమే ప్రస్తావిస్తున్నారని, మిగిలిన వారు ఎందుకు మాట్లాడటం లేదని సన్నిహితులతో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.