ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా తెలంగాణ పోలీసుల ప్రవర్తనను ఆంధ్రా పోలీసుల ప్రవర్తనతో చాలా మంది పోల్చి చూసుకుంటున్నారు. ఆంధ్రాలో పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించిన సంఘటనలు కో కొల్లలుగా ఉన్నాయి. ఆంధ్రాలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై పోలీసులు జరుపుతున్న దాష్టీకంతో పోలిస్తే తెలంగాణ పోలీసులు వై ఎస్ షర్మిల పట్ల అత్యంత సానుభూతితో వ్యవహరించినట్లే కనిపిస్తున్నదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు చంద్రబాబునాయుడిని, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ ను చంపేస్తామని బెదిరిస్తే అతడికి బాసటగా అతను ర్యాలీ తీసుకోవడానికి అనుమతించారు.
అతనికి రక్షణగా పోలీసులు నిలబడ్డారు. అదేమని ప్రశ్నించిన తెలుగుదేశం నాయకుడిని గొంతుపట్టుకుని అవతలకు తోశారు. తాజాగా జరిగిన ఈ సంఘటనతో పోలిస్తే హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది పెద్ద సంఘటన కాదని వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టిన వై ఎస్ షర్మిలకు స్వయానా సోదరుడే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
నిన్న మొన్నటి వరకూ ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వై ఎస్ విజయలక్ష్మి ఇప్పుడు తెలంగాణ కు వచ్చి ‘‘నా కూతుర్ని వదిలిపెడతారా లేదా రాష్ట్రవ్యాప్తంగా గొడవలు చేయించమంటారా’’ అంటూ పోలీసులను ప్రశ్నించడం కూడా పలువురు తెలంగాణ వాదులు తప్పుపడుతున్నారు. పోలీసు వ్యవస్థను సవాల్ చేసే విధంగా మాట్లాడినా కూడా ఆమెను గౌరవంగా చూశారే తప్ప పోలీసులు ఎక్కడా కూడా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించలేదు. ఆంధ్రాలో అయితే ఇలా మాట్లాడితే పోలీసులు తక్షణమే అరెస్టు చేసి ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారో కూడా చెప్పరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై, కాన్వాయ్పై టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్టలో ఆమె కారును అడ్డుతగిలారు. డోర్ లాక్ చేసుకుని షర్మిల కారు లోపలే ఉన్నారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కారును క్రేన్తోనే లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగానే లాక్కెళ్లారు. ఆ తర్వాత పీఎస్ బలవంతంగా కారు డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య వస్తుందనే షర్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. రోడ్డుపై షర్మిల, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.